ఇదో దీర్ఘకాల శ్వాసకోశ సమస్య. ప్రత్యేకించి ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలకు సంబంధించిన సమస్య. మనం ముక్కుతో పీల్చుకునే గాలి శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల లోపలికి చేరుకుంటుంది. ఈ శ్వాసనాళం పైనుంచి రెండుగా చీలుతూ వచ్చి.. మళ్లీ చిన్న చిన్న గొట్టాలుగా విడిపోతూ.. అతి సూక్ష్మమైన గాలిగదుల్లోకి గాలిని చేరవేస్తుంది. ఇదంతా ఎంతో సునాయాసంగా, ఎలాంటి కష్టం లేకుండా సాగిపోయే ప్రక్రియ. ఆస్థమా బాధితుల్లో సరిగ్గా ఇదే అస్తవ్యస్తమవుతుంది. సాధారణంగా దుమ్ము ధూళి ఉన్న ప్రాంతాలకు వెళ్లినప్పుడు దగ్గు రావటం మామూలే. ఇది హాని కారకాలు లోపలికి ప్రవేశించకుండా, వాటిని బయటకు నెట్టివేయటానికి శరీరం చేసే ప్రయత్నమే. ఆస్థమా వచ్చే స్వభావం (అటోపీ) గలవారికి ఇలాంటి మామూలు విషయాలే పెద్ద సమస్యగా మారతాయి.

దుమ్ము ధూళి వంటివి తగిలినప్పుడు లోపల అలర్జీ ప్రేరేపితమై గాలిగొట్టాలు విపరీతంగా స్పందిస్తుంటాయి. ఆస్థమాకు మూలం ఇదే. గాలిగొట్టాలకు అలర్జీ కారకాలు తగిలినప్పుడు రోగనిరోధక కణాలు అతిగా స్పందిస్తాయి. దీంతో వాపు ప్రక్రియ (ఇన్ ఫ్లమేషన్) మొదలవుతుంది. ఫలితంగా గాలిగొట్టాల గోడలు ఉబ్బిపోయి లోపలి మార్గం సన్నబడుతుంది. మరోవైపు గాలి గొట్టాల్లో జిగురుద్రవం ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇది లోపలే చిక్కుకు పోతుంది. దీంతో శ్వాస తీసుకోవటం, వదలటం కష్టమైపోతుంది. దగ్గు, ఆయాసం, పిల్లికూతల వంటి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ లక్షణాలు కొందరిలో కొద్దిసేపే ఉండొచ్చు. ఒకట్రెండు లక్షణాలే ఉండొచ్చు. కొందరికి ప్రత్యేకించి కొన్ని సమయాల్లోనే తలెతొచ్చు. కొందరికి నిరంతరం వేధిస్తుండొచ్చు. కొందరికి ఎలాంటి లక్షణాలు లేకుండానూ ఆస్థమా ఉండొచ్చు (సైలెంట్ చెస్ట్).

ముప్పు ఎవరికి?
అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర్నుంచి పండు ముదుసలి వరకు ఎవరికైనా, ఏ వయసులోనైనా ఆస్థమా రావొచ్చు. దీనికి ప్రధాన కారణం. వంశపారంపర్యంగా సంక్రమించే జన్యువులు. తల్లిదండ్రులిద్దరికీ ఆస్థమా ఉంటే పుట్టబోయే బిడ్డకు రావటానికి 70% వరకూ అవకాశం ఉంది. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికే ఆస్తమా ఉంటే 30 % వరకు ముప్పు పొంచి ఉంటుంది. అదేపనిగా అలర్జీ కారకాలకు గురవుతున్నప్పుడు జన్యువులు లేకపోయినా ఆస్థమా దాడి చేయొచ్చు. ఆస్థమా బాధితుల్లో సుమారు 6% మంది ఇలాంటివారే. మానసిక ఆందోళన, ఒత్తిడి, కొన్నిరకాల వృత్తులు, ఇన్ ఫెక్షన్ల వంటివీ ఆస్థమాను ప్రేరేపించొచ్చు.

పరీక్షలతో నిర్ధరణ
ఆస్థమా నిర్ధరణకు స్పైరోమెట్రీ పరీక్షే ప్రామాణికం. దీంతో ఊపిరితిత్తుల సామర్థ్యం బయటపడుతుంది. కొందరికి పీప్లో మీటర్ పరీక్ష కూడా చేస్తారు. ఇది నిర్ధరణకే కాదు, జబ్బు అదుపులో ఉందో లేదో తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. తొలిదశలో కొన్నిసార్లు ఈ పరీక్షల్లో సమస్య తేలకపోవచ్చు. అప్పుడు అలర్జీ కారకాలను ఇచ్చి పరీక్షిస్తారు. అలర్జీ కారకాలను కచ్చితంగా గుర్తించటానికి కొందరికి స్కిన్ ప్రిక్ పరీక్ష చేయాల్సి రావొచ్చు. క్షయ, సీవోపీడీ వంటి ఇతరత్రా సమస్యలేవైనా ఉన్నయేమో చూడటానికి ఎక్స్ రే కూడా అవసరమవుతుంది. అలర్జిక్, నాన్ అలర్జిక్ ఆస్థమాను తెలుసుకోవటానికి రక్త పరీక్ష ఉపయోగపడుతుంది.