ఇలా తిన్నారంటే… మీ ఆరోగ్యానికి ఏ ధోకా లేనట్టే
అర్థరాత్రి సమయంలో భోజనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. మన శరీరం రాత్రిపూట విశ్రాంతి తీసుకోవడోనికి సిద్ధమవుతున్నప్పుడు మన జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదిస్తుంది. అప్పుడు కేలరీలు కొవ్వుగా శరీరంలో పేరుకుపోయే ప్రమాదం బాగా పెరుగుతుంది. అందుకే, పడుకునే ముందు, అర్థరాత్రి సమయంలో ఆహారం తినకపోవడమే శ్రేయస్కరం. ఆయుర్వేద నిపుణుల ప్రకారం, నిద్ర పోవడానికి 2-3 గంటల ముందే భోజనం చేయాలి.
జీర్ల అగ్ని (Digestive Fire), మానవ శరీరం సూర్యుని కదలికను అనుకరిస్తుంది కాబట్టి మధ్యాహ్నం తినే భోజనం తప్పనిసరిగా రోజులో అత్యంత పెద్ద భోజనం అయి ఉండాలి. మిగతా వేళల్లో తక్కువగా తిన్నా, మధ్యాహ్న భోజనంలో బాగా తినాలి. అప్పుడు తిన్నదంతా కూడా చక్కగా జీర్ణమయ్యి శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.
అజీర్తి సమస్యతో ఎక్కువగా బాధపడుతున్న వారు.. అప్పుడప్పుడు ఉపవాసం ఉండటం మంచిది. మీరు ఇంతకు ముందు తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోయినా,కడుపుబ్బరంగా అనిపించినా, ఇప్పటికీ అదే ఆహారానికి సంబంధించిన తేన్పులు బాధిస్తున్నా.. భోజనం మానేసి, ఎండు అల్లం కలిపిన గోరువెచ్చని నీరు తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. బాగా ఆకలి అయిన ప్రతిసారీ కడుపునిండా తినడం కంటే 70-80 శాతం మాత్రమే కడుపు నిండేలా తినాలి. ఆకలి తీరే వరకు ఆహారం లాగించేస్తే… ఆ ఆహారం సరిగా జీర్ణం కాదు. అందుకే భోజనం బాగా జీర్ణం కావడానికి కడుపును కాస్త ఖాళీగా ఉంచుకోవాలి.
ఆయుర్వేదం ప్రకారం, ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం మంచిది కాదు. ఎప్పుడో వండిన ఆహారం చల్లారిపోతే దానిని మళ్లీ వేడి చేసుకుని తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ ఆహారపు అలవాటు వల్ల ఆరోగ్యం నాశనం అవుతుంది. అందుకే పొద్దున్నే వండిన ఆహారాన్ని రాత్రి తినడం, రాత్రి వండిన ఫుడ్ను తెల్లారి తినడం మానేయాలి. పగటిపూట చేసిన ఆహారం రాత్రిపూట తీసుకుంటే మంచిదే. కానీ ఫ్రిజ్ లో స్టోర్ చేసిన ఫుడ్ ను తరచూ వేడి చేసి తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే తాజాగా వండిన ఆహారాన్ని తినడానికే ఎక్కువగా ప్రయత్నించాలి.