ఒక కప్పు పైనాపిల్ పండ్ల ద్వారా మనకు 82 క్యాలరీల శక్తి లభిస్తుంది. వీటిలో ఫైబర్, విటమిన్ సి, మాంగనీస్, విటమిన్ బి6, కాపర్, థయామిన్, ఫోలేట్, పొటాషియం, మెగ్నిషియం, నియాసిన్, పాంటోథెనిక్ యాసిడ్, రైబోప్లేవిస్, ఐరన్లు లభిస్తాయి. దీంతో శరీరానికి పోషణ లభిస్తుంది. పైనాపిల్స్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయి. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతీ రోజు ఒక గ్లాసు పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల దంతాలు పటిష్టం కావటంతోపాటు చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. పుల్లపుల్లగా, తీయతీయగా ఉన్న అనాస పండు రసాన్ని తాగితే వాంతులు తగ్గుతాయి.

పచ్చ కామెర్లతో బాధపడుతున్న వారికి ఈ రసం ఎంతో మేలు చేస్తుంది. పైనాపిల్ పండ్లలో బ్రొమెలెయిన్ అనబడే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది మనం తినే ఆహారంలోని ప్రోటీన్లను సులభంగా జీర్ణం చేస్తుంది. మాంసాహారం తిన్నవారు పైనాపిల్ పండ్లను తింటే త్వరగా ఆ ఆహారం జీర్ణమవుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. పైనాపిల్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బ్రొమెలెయిన్ ఎంజైమ్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. అందువల్ల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. పైనాపిల్ పండ్లను తినడం వల్ల శరీరంలో తెల్ల రక్త కణాలు పెరుగుతాయి. దీంతో వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. మన శరరీంలో చేరే సూక్ష్మ క్రిములు ఎప్పటికప్పుడు నశిస్తాయి.

కీళ్లసంబంధిత సమస్య ఉన్నవారు పైనాపిల్ పండ్లను తరచూ తింటుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. పైనాపిల్లో మేంగనీస్ అధికంగా ఉంటుంది. దీని వల్ల ఎముకలు పటిష్టంగా తయారు అవుతాయి. పైనాపిల్ పండ్లలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి. శస్త్ర చికిత్స అయిన వారు పైనాపిల్ పండ్లను తింటే త్వరగా కోలుకుంటారు. రక్త నాళాల్లో రక్తం గడ్డకట్ట కుండా కాపాడుతుంది. మహిళలకు నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. పండిన అనాస పండును తింటుంటే పళ్ళ నుండి రక్తంకారే స్కర్వే వ్యాధి రాకుండా తోడ్పడుతుంది. అనాసపండు రసాన్ని ముఖానికి రాసుకుని మర్ధన చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుంది పండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి.