రోగనిరోధకశక్తి బలోపేతం కావటానికి తేనె బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విశృంఖల కణాలను, హానికారక బ్యాక్టీరియాను అడ్డుకునే గుణాలు దండిగా ఉంటాయి. తేనెను శుద్ధి చేసినప్పుడు, వెలుగు తగిలినప్పుడు దీనిలోని పుప్పొడి దెబ్బతింటుంది. ఎక్కువ పోషకాలు ఉండేది ఇందులోనే. అందువల్ల ముడి తేనె అయితే మేలు. ఇందులో క్యాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్పరస్, సల్ఫర్, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్ సి, విటమిన్ బి వంటి విటమిన్లు, ప్రొటీన్లు కూడా ఉంటాయి. ముదురు రంగు తేనెలో యాంటీఆక్సిడెంట్లు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి.
ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచాడు తేనె, సగం చెక్క నిమ్మరసం కలిసి పరగడుపున తాగితే మలబద్దకం, ఛాతీ మంట తగ్గుతాయి. ఊబకాయం తగ్గటానికి ఉపవాసం చేసేవారు తేనె, నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. మద్యం తాగిన మర్నాడు తలెత్తే తలనొప్పి వంటి సమస్యలకూ తేనె కళ్లెం వేస్తుంది. ఇందులోని ఫ్రక్టోజ్ అనే సహజ చక్కెర కాలేయం మద్యాన్ని త్వరగా విడగొట్టేలా చేస్తుంది. హాయి భావన కలిగిస్తుంది.