రోజంతా నోరాడిస్తున్నారా?
కొందరు ఎప్పుడూ మిఠాయిలు, జంతికల వంటి చిరుతిళ్ల వంటివి ఏదో ఒకటి నోట్లో వేసుకొని నములుతూనే ఉంటారు. తినేది కాస్తే కదా ఏమీ కాదులే అని భావిస్తుంటారు. ఇది మంచి పద్దతి కాదు. దీనికి సహేతుక కారణాలే ఉన్నాయి.
మనం ఏదైనా తిన్నాక రెండు గంటల వరకు పళ్ల మీద ఎనామిల్ క్షీణిస్తూ ఉంటుంది. అందుకే భోజనం చేశాక పళ్లు తోముకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. ఇక తరచూ ఏదో ఒకటి నములుతూ, బ్రష్ చేసుకోకుండా ఉన్నట్టయితే ఎనామిల్ దెబ్బతినే ప్రక్రియ రోజంతా కొనసాగుతూనే ఉంటుంది. దీంతో దంతాలు క్షీణించే ముప్పూ పెరుగుతుంది.
తినటం మొదలు పెట్టిన వెంటనే రక్తంలో ట్రైగ్లిజరైడ్ల మోతాదులు పెరుగుతాయి. కొన్ని చిరుతిళ్ళు (మిఠాయిల వంటివి) ప్లేట్ లెట్ కణాలు జిగురుగా అయ్యేలా చేస్తాయి. దీంతో రక్తం గడ్డ కట్టే స్వభావం పెరుగుతుంది. ఫలితంగా గుండెజబ్బుల ముప్పు ఎక్కువవుతుంది. మరోవైపు తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేస్తుంది. అదేపనిగా ఈ ప్రక్రియ కొనసాగుతూ వస్తుంటే రక్తంలో ఇన్సులిన్ మోతాదులు నిరంతరం ఎక్కువ స్థాయిలోనే ఉండే ప్రమాదముంది. ఇది ఊబకాయం, గుండెపోటు మటి సమస్యల ముప్పు పెరిగేలా చేస్తుంది.
ఆ చిరుతిళ్లతో మరో సమస్య- కడుపు నిండినట్టు అనిపించకపోవటం. దీంతో ఎక్కువెక్కువగా తింటారు. బరువు తగ్గాలని అనుకునే వారికిది చేటే.
ఎప్పుడూ ఏదో ఒకటి తింటుంటే నిద్ర కూడా అస్తవ్యస్తం కావొచ్చు. కేలరీలు తప్ప ఎలాంటి పోషకాలు లేని జంక్ ఫుడ్ తింటున్నట్టయితే పోషణ లోపానికి దారితీయొచ్చు.
మనం ఏదైనా తిన్నప్పుడు జీర్ణకోశానికి రక్తం ఎక్కువగా సరఫరా అవుతుంది. కండరాలు, మెదడుకు తక్కువగా అందుతుంది. అందువల్ల ఎప్పుడూ ఏదో ఒకటి తింటుంటే రక్తసరఫరా వ్యవస్థ క్రమం ఆస్తవ్యస్తమవుతుంది. అదేపనిగా తినటం అజీర్ణం, ఛాతీలో మంట వంటి సమస్యలకు దారితీయొచ్చు.